ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై పశ్చిమ దేశాలు రకరకాల ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు, ఆహారపు ఉత్పత్తుల దిగుమతులపైనే చాలా దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ఈయూ డిప్లొమసీ హెడ్ జోసెఫ్ బారెల్ మాట్లాడుతూ.. యూరోపియన్ ప్రజలంతా ఇళ్లలో ఉపయోగించే హీటింగ్ వ్యవస్థను తక్కువగా వాడాలని, తద్వారా రష్యాతో సంబంధాలను తగ్గించుకోవచ్చని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా జర్మనీ వ్యవసాయ, ఆహార శాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ కొత్త ప్రతిపాదన చేశారు. తాను వెజిటేరియన్ అని చెప్పిన ఆయన.. ప్రజలంతా వెజిటేరియన్లుగా మారాలని తను చెప్పడం లేదని, కానీ మాంసాహారం తక్కువ తినడం ద్వారా కూడా రష్యాపై పోరులో ఎంతో కొంత సాయం చేయవచ్చని తెలిపారు. రష్యా తన ఎగుమతి శక్తిని ఉపయోగించుకుంటోందని, దాన్ని తగ్గించడం కోసం ప్రజలు తక్కువగా మాంసం తినడంతోపాటు, ఆహారాన్ని వృధా చేయడం మానుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలపై రష్యా విదేశాంఖ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందించారు. సదరు మంత్రి జర్మన్ ప్రజలకు అలా చెప్పడం బాధాకరమన్నారు. అక్కడితో ఆగకుండా, ‘‘ అంతేకాదు, జర్మన్లు ఊపిరి కూడా కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. ఇది వాతావరణ రక్షణకు ఉపయోగపడుతుంది. లేదంటే ఇలా చేయడం కూడా రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని అంటే సరిపోతుంది కదా’’ అంటూ జర్మన్ మంత్రిని ఎద్దేవా చేశారు.