వాషింగ్టన్, మార్చి 22 : యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరునాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ‘హొర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్కు ఇది సరైన సమయం’ అని తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. టెహ్రాన్కు మంగళవారం ఉదయం 5.14 గంటల (భారత కాలమాన ప్రకారం) వరకు సమయం ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఇరాన్ తమ హెచ్చరికలను పట్టించుకోకుండా 48 గంటల్లో హొర్ముజ్ను తెరవకపోతే ఆ దేశంలోని అతి పెద్ద విద్యుత్తు ప్లాంట్ ధ్వంసంతో పని ప్రారంభించి మొత్తం ప్లాంట్లను తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ మిలిటరీ స్పందించింది. ట్రంప్ తమ విద్యుత్తు ప్లాంట్లపై దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికాకు చెందిన అన్ని ఇంధన, సాంకేతిక, ఉప్పునీటి శుద్ధి మౌలిక సదుపాయాలు లక్ష్యంగా తాము దాడి చేస్తామని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖైతమ్ అల్-అన్బియా తెలిపింది. అలాగే హొర్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని, ప్లాంట్లను తిరిగి నిర్మించేంత వరకు మళ్లీ తెరువబోమని హెచ్చరించింది. అయితే అంతకుముందు శత్రుదేశాలకు చెందిన నౌకలు తప్ప మిగిలిన అన్నింటినీ హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నట్టు ఇరాన్ తెలిపింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇరాన్ ప్రతినిధి అలీ మౌసవి ఆదివారం మాట్లాడుతూ ఇరాన్ శత్రు దేశాలతో సంబంధం లేని నౌకలన్నింటినీ జలసంధి గుండా భద్రంగా, సురక్షితంగా వెళ్లే ఏర్పాట్లను టెహ్రాన్ చేసిందని తెలిపారు. సముద్ర రవాణా భద్రతను పెంచడానికి, గల్ఫ్లో సముద్రయాన సిబ్బందిని రక్షించడానికి ఐరాసతో సహకరించడానికి తాము సిద్ధమేనని చెప్పారు. హొర్ముజ్లో ప్రస్తుత పరిస్థితికి ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులే కారణమని ఆరోపించారు. ఇప్పటికీ దౌత్యమార్గంలో సమస్య పరిష్కారానికి ఇరాన్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందుకు దురాక్రమణ పూర్తిగా ఆగిపోవడం, పరస్పర నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యమని మౌసవి పేర్కొన్నారు.

నతాంజ్ అణుకేంద్రంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ అణు కేంద్రానికి నిలయంగా ఉన్న డిమోనా పట్టణంతో పాటు అరద్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. భారత సంతతి పౌరులు ఎక్కువగా ఉండే డిమోనాను ‘లిటిల్ ఇండియా’గా కూడా వ్యవహరిస్తుంటారు. శనివారం నతాంజ్ అణు కేంద్రంపై చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. దెబ్బకు దెబ్బ లక్ష్యంతో డిమోనాలోని షిమోన్ పెరెస్ నెగెవ్ నూక్లియర్ సెంటర్పై దాడి చేసినట్టు తెలిపింది. రెండు పట్టణాలపై నేరుగా జరిపిన క్షిపణి దాడుల్లో అక్కడి నివాస భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, వందలాది మంది గాయపడ్డారని తెలిపింది. ఈ రెండు పట్టణాల్లో ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్టార్స్ ప్రయోగించినా, క్షిపణులను అడ్డుకోవడంలో అవి విఫలమయ్యాయి. దీంతో వందలాది కిలోల వార్హెడ్స్తో వచ్చిన క్షిపణులు భారీ విధ్వంసాన్నే సృష్టించాయని, అక్కడి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారని ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. అరద్లో 84 మంది గాయపడ్డారని, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని, డిమోనాలో 33 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఆకాశం నుంచి ఒక అగ్నిగోళం వచ్చిన విధంగా క్షిపణి దాడి జరిగినట్టు వీడియోల్లో కన్పించింది. కాగా, ఇది చాలా కష్టమైన సాయంత్రమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అత్యవసర బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని, హోమ్ ఫ్రంట్ కమాండ్ అధికారులు ఇచ్చే సూచనలు, ఆదేశాలను పౌరులు పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. ‘అన్ని విధాలుగా శత్రువుపై దాడులు కొనసాగించడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం’ అని ఆయన ప్రకటించారు.
ఇజ్రాయెల్లో దాడికి గురైన డిమోనా నగరంలో భారతీయులు అధికంగా నివసిస్తుంటారు. లిటిల్ ఇండియాగా వ్యవహరించే ఈ పట్టణం ఇజ్రాయెల్ అణ్వాయుధ కేంద్రం కీలక ప్రదేశాలలో ఒక దానికి 20 కి.మీ దూరంలో ఉంది. ఈ నగరంలోకి అడుగుపెట్టిన వెంటనే ప్రదర్శనకు ఉంచిన రంగురంగుల దుస్తులు ఆకట్టుకోవడంతో పాటు, జిలేబీలు, చాట్ల ఘుమఘుమలు మనల్ని తాకుతాయి. 7,500 మందితో భారత-యూదు కమ్యూనిటీ వారు ఇక్కడ పటిష్ఠ ముద్ర వేశారు. పట్టణ జనాభాలో 30 శాతం మంది భారతీయ సంతతికి చెందిన వారే ఉన్నారు. మరాఠీని అనర్గళంగా, హిందీ కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ క్రికెట్ను ఆరాధించే వారి సంఖ్య అధికంగానే ఉంది.