ఆన్లైన్ ట్రేడింగ్ విన్బిజ్ యాప్లో పెట్టుబడి పేరుతో భారీ లాభాలంటూ మోసానికి పాల్పడిన ముగ్గురిని శనివారం రాచకొండ సైబర్క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విన్బిజ్ ఆన్లైన్ ట్రేడింగ్ మోసం ప్రధాన కేంద్రం హంకాంగ్లో ఉన్నట్లు గుర్తించారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. హయత్నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఫిబ్రవరిలో హంకాంగ్ కు చెందిన ఫోన్ నంబర్తో వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడిన వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ విన్బిజ్ గురించి వివరించాడు. పెట్టుబడి పెడితే ప్రతిరోజు లాభాలు వస్తాయని, ప్లేస్టోర్ నుంచి విన్బిజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తూ ఓ లింక్ను పంపించాడు. ఆశ కలిగిన ఆమె విన్బిజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెను రూ.500తో యాప్ను రీచార్జి చేసుకోవాలనగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి రీచార్జి చేసుకున్నది.
ఆ తర్వాత మొదటి రీచార్జి వచ్చిన లాభానికి ఆకర్షితురాలై వెంటనే మరో రూ.20 వేలు రీచార్జి చేసుకొని రూ.30 వేల వరకు ట్రేడింగ్కు సిద్ధమైంది. ఇలా మాయలో పడేసిన సైబర్ మోసగాళ్లు ఆమెను..మరిన్ని లాభాలు కావాలంటే మరింత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాల ని కోరగా, పలు దఫాల్లో రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. వారు వర్చువల్గా రూ.54.39 లక్షలు లాభాలు వచ్చినట్లు విన్బిజ్ ఖాతాలో చూపించారు. విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోగా, కొన్ని అంశాలను బ్లాక్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మహిళ బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయిన వివరాలు పరిశీలించి ఆరా తీయ గా, మోసానికి పాల్పడింది బెంగళూరుకు చెందిన అశోక్కుమార్ ఆర్ముగం, కంచి సంజీవ్కుమార్, ఆసిం అక్తర్లుగా నిర్ధారించి శనివారం వారిని అరెస్టు చేశారు. వీరికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకులో దాదాపు రూ.3.50 కోట్లను ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించారు.
హంకాంగ్కు చెందిన స్కాట్వ్యాంగ్ ఈ విన్బిజ్ యాప్ను రూపొందించి అశోక్కుమార్ ఆర్ముగం.. సంజీవ్కుమార్, ఆసిం అక్తర్లను మనదేశంలో నియమించుకొని సుమారు 15 కంపెనీలను తెరిపించాడు. వాటితో పేమెంట్ గేట్వే రేజన్పే, పే-యూ, ఈజ్బజ్, పేటీఎంలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఖాతాలన్నింటినీ స్కాట్వ్యాంగ్ చూసుకుంటుండటంతోపాటు వాటి విత్ డ్రాలను కూడా అతడి చేతిలోనే ఉంచుకుంటూ.. ఇక్కడి వారికి కమీషన్లు ఇచ్చేవాడని తెలిసింది.