Time Most Influential People | ప్రపంచ వ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2025ను ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ తాజాగా (Time Most Influential People) విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus), టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. అయితే, ఈ సారి భారత్కు చెందిన వారెవరికీ ఇందులో చోటు దక్కకపోవడం గమనార్హం.
2025 టైమ్ మ్యాగజైన్.. రాజకీయాలు, సైన్స్, వ్యాపారం, వినోదం ఇలా పలు కేటగిరీల నుంచి 100 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్, యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ వంటి అనేక మంది ప్రపంచ నాయకులు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్,పాపులర్ సింగర్ ఈద్ షరీన్,ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్ ల పేర్లు కూడా ఉన్నాయి. కానీ, భారత్ నుంచి ఒక్కరి పేరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.
గతేడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత 100 మంది ప్రభావశీలుర జాబితాలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. ఈ సారి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
Also Read..
Boat Catches Fire | ఘోర ప్రమాదం.. 50 మంది మృతి
ED | సురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో రెండో రోజూ ఈడీ సోదాలు