నల్లగొండ రూరల్, మే 13 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) ఆధ్వర్యంలో నల్లగొండ మండల వ్యాప్తంగా ఆరు కేంద్రాలతోపాటు ఒక సబ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో జోరుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.నల్లగొండ మండలంలో ఐకేపీ కేంద్రాలతోపాటు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆరు ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు 1391మంది రైతుల నుంచి లక్షా 26 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. 17శాతం తేమ, తాలు లేకుండా ఉన్న ధాన్యాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు గుర్తించి వాటిని కాంటాలు వేసి మిల్లులకు తరలిస్తున్నారు. పానగల్ కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 58,333 క్వింటాళ్లు, రెడ్డికాలనీ 9500, ముశంపల్లి 14,500, రసూల్ఫూర్ 14,811, గుండ్లపల్లి 14,830, రంగారెడ్డి నగర్ 13,938 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 60 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన 48గంటల్లోపే రైతుల ఖాతాలో అధికారులు డబ్బుల జమ చేస్తున్నారు.
చిట్యాలలో ముమ్మరంగా..
చిట్యాల : లాక్డౌన్లోనూ ప్రభుత్వం ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తున్నది. చిట్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో చిట్యాల, నేరడ, ఉరుమడ్ల, ఎలికట్టె, తాళ్లవెల్లంల, వట్టిమర్తి, వనిపాకల, పీఏసీఎస్ గుండ్రాంపల్లి ఆధ్వర్యంలో గుండ్రాంపల్లి, సుంకెనపల్లి, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వెల్మినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వ్యవసాయ మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో చిట్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 12,895 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 2003 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కాగా ఆయా కేంద్రాల్లో మరో 10,779 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులకు ఇబ్బంది కలుగకూడదని ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులను చైతన్యపరుస్తూ కొనుగోళ్లు చేస్తున్నాం. వానకాలం కంటే కొనుగోళ్లు పెరిగాయి. గతేడాది లక్షా 75వేల క్వింటాలు కొనుగోలు చేశాం. ఇప్పుడు లక్షా 90వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తాం.