కాబూల్ : (Akhundzada) గత ఐదేండ్లుగా తెరవెనుకే ఉంటూ తమ ఉగ్రవాద సంస్థను శక్తివంతం చేస్తున్న తాలిబాన్ సుప్రీం లీడర్ ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారిగా ప్రపంచం ముందు ప్రత్యక్షమయ్యాడు. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ యూఎస్ డ్రోన్ దాడిలో మరణించిన తర్వాత 2016లో అఖుంద్జాదా గ్రూప్ సుప్రీం హెడ్గా బాధ్యతలు చేపట్టారు. దక్షిణ ఆఫ్ఘన్ నగరం కాందహార్లో శనివారం రాత్రి దారుల్ ఉలూమ్ హకీమా మదర్సా కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణ ప్రజలు, తన మద్దతుదారులను కలుసుకుని ప్రసంగించారు. ఈ విషయాన్ని తాలిబాన్ ధ్రువీకరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన అఖుంద్జాదా ఫొటోలు గానీ, వీడియోలను గానీ తాలిబాన్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయలేదు. కానీ అఖుంద్జాదా ప్రసంగానికి సంబంధించిన 10 నిమిషాల ఆడియోను మాత్రం అప్లోడ్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అఖుంద్జాదా ఫొటోలు, వీడియోలను తీసేందుకు ఎవరినీ అనుమతించలేదని తాలిబాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాలిబాన్ సోషల్ మీడియా ఖాతాలో తనను తాను అమీరుల్ మోమినెన్ లేదా కమాండర్ ఆఫ్ ఫెయిత్ఫుల్ అని చెప్పుకున్న అఖుంద్జాదా.. ఆఫ్ఘన్ లేదా ప్రపంచ రాజకీయాల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆయన ప్రసంగమంతా మతం ఆధారంగా కొనసాగింది. చనిపోయిన తాలిబాన్ యోధుల కోసం ప్రార్థనలు చేశాడు. ఆగస్ట్లో కాబూల్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నది. అప్పటినుంచి ఇప్పటివరకు అఖుంద్జాదా ప్రపంచానికి కనిపించలేదు. అమెరికా, రష్యా దేశాలతో తాలిబాన్ జరిపిన చర్చల్లో కూడా పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ ఆక్రమించిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో ఆధిపత్యంపై సంస్థలో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల తర్వాత కూడా అఖుంద్జాదా కనిపించకపోవడంతో ఆయన చనిపోయి ఉంటాడని పుకార్లు వ్యాపించాయి.
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
ఇకపై జూలై 18 తమిళనాడు దినం : ప్రకటించిన సీఎం స్టాలిన్
ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..