Afghanistan | అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు (Talibans).. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘాన్ (Afghanistan)ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా మహిళల విషయంలో తాలిబన్లు మరో కొత్త రూల్ను తీసుకొచ్చారు. ఇంట్లోని మహిళలు బయటివారికి కనిపించకుండా ఉండేలా కిటికీలు (windows) ఏర్పాటు చేయొద్దని పాలకులు ఆదేశించారు.
ఇంట్లో మహిళలు తిరిగే వంట గదులు, బావుల వద్ద ఎటువంటి కిటికీలు నిర్మించకూడదని స్పష్టం చేశారు. వారు కనిపించకుండా గోడలు కట్టాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లల్లో ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబన్ సుప్రీం లీడర్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటికి ఈ నిబంధనల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు.
2021లో ఆఫ్గానిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించారు. మహిళల ఉన్నత చదువులపై, ఈద్ వేడుకల్లో పాల్గొనడం, జిమ్లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది స్త్రీలపై దారుణ వివక్ష అని మండిపడింది.
Also Read..
“ఖురాన్ను బిగ్గరగా పఠించడమూ నేరమే”
“Afghanistan | మొన్న ఉన్నత చదువులపై ఆంక్షలు.. ఇప్పుడు బ్యూటీ సెలూన్లపై నిషేధం !”
“Afghanistan | మహిళలకు వర్సిటీ విద్యపై నిషేధం.. తరగతులు బహిష్కరించిన పురుష విద్యార్థులు”
“మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వం.. తాలిబాన్ సర్కార్ నిర్ణయం”
“టీవీల్లో మహిళల షోలపై నిషేధం.. ఆఫ్ఘన్ తాలిబన్ల కొత్త రూల్”