అసలే కరువు ఆపైన చేతిలో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తాలిబాన్ పరిస్థితి కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్లో బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్.. దేశంలో ఆకలి, కరువు రాజ్యమేలుతున్న సమయంలో ఘోరమైన తప్పుచేసింది. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున శత్రుదేశమైన తజికిస్తాన్లోని రాయబార కార్యాలయానికి పంపింది.
జరిగిన తప్పును గుర్తించి తజికిస్తాన్ రాయబార కార్యాలయం అధికారులకు ఆ డబ్బును తిరిగి పంపమని అడిగితే.. వాళ్లు అలా కుదరదని సూటిగా చెప్పేశారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి మద్దతుదారు అయిన తజికిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లకు వ్యతిరేకం.
తాలిబాన్లు ఉగ్రవాదులని.. అటువంటి ఉగ్రవాదుల బ్యాంకు అకౌంట్లకి డబ్బు పంపించేది లేదని తజకిస్తాన్ అధికారులు చెప్పారు. తాలిబాన్ పంపించిన డబ్బును ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి తజకిస్తాన్లో శరణార్థి శిబిరాలలో ఉండే పేదల కోసం ఖర్చుపెడతామని వారు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు కూడా తాలిబాన్ భయంతో వలస వెళ్లిపోయారు. దేశమంతా వ్యాపారాలు లేక ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. విదేశాలు కూడా అప్పులిచ్చేందుకు నిరాకరించాయి. ఇటువంటి పరిస్థితులలో 8 లక్షల డాలర్లు పోగొట్టుకోవడమంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లే.