వర్జీనియా : (Last wish) తన తండ్రి ఎవరో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి ఎన్నో రోజులు కష్టపడ్డాడు. డీఎన్ఏ ఆధారంగా తనను కన్న వ్యక్తిని గుర్తించాడు. చివరకు మృత్యువు తరుముకొస్తున్న దశలో తండ్రిని కలుసుకుని చివరి కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడు హాయిగా కన్నుమూస్తానని చెప్తున్నాడా వ్యక్తి.
అమెరికాలోని వర్జీనియాకు చెందిన సామ్ ఆంథోని (52) ఫాల్స్ చర్చి ప్రాంతంలో నివాసం. పుట్టినప్పటి నుంచి తన తండ్రిని ఏనాడూ కలువలేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన సామ్కు తన అసలైన తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తెలిసిన వారినల్లా ప్రశ్నించాడు. చాలా ప్రాంతాల్లో ఆరా తీశాడు. చివరకు స్నేహితులు, ఒక మ్యాగజైన్ సాయంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా తన తండ్రి క్రేగ్ నెల్సన్ (78) అని తెల్సుకున్నాడు. సామ్ 2005 నుంచి గొంతు, నోటి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వ్యాధి ముదిరి దవాఖానలో మంచానికే పరిమితమయ్యాడు. చివరి క్షణాలను అనుభవిస్తున్న సామ్కు తన తండ్రిని కలుసుకోవాలన్న కోరిక బలంగా నాటుకున్నది. దాంతో క్రేగ్ నెల్సన్కు ఒక లేఖ రాసి వివరాలు పంపాడు. లేఖ అందుకున్న ఎయిర్లైన్ మాజీ ఉద్యోగి అయిన క్రేగ్.. అది తనకు చెందింది కాదని తొలుత తటపాయించాడు. తనకు ఫాల్స్ చర్చిలో పరిచయస్తులు ఎవరూ లేరని భావించాడు. ఏమైతేనేం లేఖను విప్పి చూడగా.. అతడిలో వణుకు మొదలైంది. లేఖలో ఉన్న సారాంశం అర్థం చేసుకుని మృత్యువు ముంగిట ఉన్న తన కుమారుడిని కలుసుకునేందుకు క్రేగ్ నెల్సన్ సిద్ధమయ్యాడు.
తాను 23 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు 1966 లో సైన్యంలో చేరినప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెండ్లి చేసుకోవాలని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అతడి వల్ల ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఇంతలో క్రేగ్ మరో నగరానికి బదిలీ అయ్యాడు. కొన్నిరోజులకు ప్రేయసి ఫోన్ కాల్ అందుకున్న క్రేగ్.. తనకు అబ్బాయి జన్మించినట్లు, అతడిని ఒకరికి దత్తత ఇచ్చినట్లు చెప్పింది. అనంతరం వారిద్దరూ కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. నార్త్ కరోలినాలో రిటైర్ అయ్యేంత వరకు ఆ అమ్మాయి గురించి వెతికాడు. కాని ఫలితం లేకపోయింది. ఈ జ్ఞాపకాలతో క్రేగ్ వర్జీనియాలోని దవాఖానకు చేరి తన ద్వారా జన్మించిన సామ్ను కలుసుకుని గుండెలకు హత్తుకున్నాడు. మరణశయ్యపై ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించాడు. ఏదైతేనేం, ఇన్ని రోజులకు తన తండ్రిని కలుసుకోవాలనుకున్న కోరిక తీర్చుకున్న తృప్తితో సామ్ ఉన్నారు.
లఖింపూర్ మృతులకు నివాళులు.. సీతాపూర్లో ప్రియాంక అడ్డగింత
శ్రీనగర్లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
నీటి శుద్ధి కోసం ‘హైడ్రోజెట్ ట్యాబ్లెట్’.. సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
గ్యాస్ సిలిండర్ ధర రూ.2,657 కిలో పాలపొడి రూ.1,200
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..