Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాలను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 15,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలల్లో ప్రజలు గాయాలపాలయ్యారు. ఒక్క తుర్కియేలోనే 12,391 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 2,992 మంది మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, భూకంపం ధాటికి రెండు దేశాలు శవాల దిబ్బలా మారిపోయాయి. ఎక్కడ చూసినా కూలిన భవన శిథిలాలే దర్శనమిస్తున్నాయి.
కాగా, భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అక్కడ బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 25వేల మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీస్తున్నారు.
భూకంపం ధాటికి 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 20వేలు దాటే అవకాశం ఉందని వెల్లడించింది.