బాలాసోర్/దిఘా/రాంచీ, మే 26: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అతి తీవ్ర తుఫాన్’ యాస్ తూర్పు తీరంపై విరుచుకుపడింది. తుఫాన్కు తోడు బుధవారం పున్నమి కావడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒడిశాలోని భద్రక్ జిల్లా ధామ్రా వద్ద తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ ధాటికి ఒడిశా, బెంగాల్లో పలుచోట్ల భారీసంఖ్యలో ఇండ్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా, రెమునాలో, భద్రక్ జిల్లా ధామ్రా, వాసుదేవ్పూర్లలో సముద్రం ముందుకొచ్చింది. తుఫాన్ కారణంగా ఒడిశాలో ముగ్గురు, బెంగాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నానికి యాస్.. అతితీవ్రం నుంచి తీవ్ర తుఫాన్ స్థాయికి బలహీనపడినట్టు వాతావారణ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది జార్ఖండ్ను తాకవచ్చని వెల్లడించింది.
20 లక్షల మందికిపైగా తరలింపు..
తుఫాన్ నేపథ్యంలో ఒడిశా 5.8 లక్షల మందిని, బెంగాల్ 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు కోటి మంది ప్రభావితమయ్యారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దాదాపు మూడు లక్షల ఇండ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు రూ.10 కోట్ల విలువైన సహాయక సామగ్రిని తరలించినట్టు చెప్పారు. బెంగాల్లోని తూర్పు మేదినీపూర్లో ఉన్న దిఘా పూర్తిగా నీటమునిగింది. సహాయక చర్యల కోసం ఆర్మీ సాయం కోరారు. పర్యాటక ప్రాంతాలైన మందర్మని, తేజ్పూర్, శంకర్పూర్లో హోటళ్లు, నివాస సముదాయాల్లోకి సముద్రపు నీరు చేరింది. సహాయక చర్యల కోసం ఆర్మీ 17 బృందాలను బెంగాల్కు తరలించింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో సాగర్ దీవుల్లోని కపిల్ ముని ఆలయం నీట మునిగింది.
తుఫాన్ నష్టాన్ని అంచనావేసేందుకు డ్రోన్లు: ఎస్బీఐ జనరల్ ఇన్యూరెన్స్
యాస్ తుఫాన్ కారణంగా ప్రభావితమైన తమ కస్టమర్ల క్లెయిమ్లను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగించనున్నట్టు తెలిపింది.
తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బుధాబలంగ్ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. కెనోఝార్ జిల్లాలోని పంచుపల్లిలో చెట్టు కూలి ఒక వ్యక్తి మరణించారు. గురువారం కూడా సముద్రం అల్లకల్లోలంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. తొమ్మిది జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మరోవైపు బెంగాల్లోని తూర్పు, పశ్చిమ మేదినీపూర్, ఝాగ్రమ్, బంకురా, దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
జార్ఖండ్ అప్రమత్తం
యాస్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా బలహీనపడినట్టు వాతావరణ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది జార్ఖండ్ను తాకనుందని పేర్కొన్నది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాం తాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన తరలింపు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ రెండు జిల్లాలతోపాటు సరాయ్కెల-ఖర్సావా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు