కీవ్: రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ నగరంలో ఉన్న రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. ఆ సిటీ కోసం జరిగిన పోరులో తాము గెలిచినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ సిటీ నుంచి శత్రు దేశ దళాలు వెనుదిరుగుతున్నట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు. గడిచిన రెండు వారాల నుంచి ఖార్కివ్ ప్రశాంతంగా ఉన్నట్లు ఓ వార్త సంస్థ జర్నలిస్టులు తెలిపారు.
అయితే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై మాత్రం రష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డెర్గాచీ వద్ద శుక్రవారం దాడులు జరిగాయి. అక్కడ ఉన్న ఓ ఆయుధ డిపోపై రష్యా దళాలు దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్పై ఆక్రమణకు వెళ్లిన రష్యాకు ఖార్కివ్ నగరాన్ని హస్తగతం చేసుకోవడమే ప్రధాన టార్గెట్. ఆరంభంలో ఆ నగరంపై భీకర దాడులు జరిగాయి. అయితే రష్యా ఆక్రమణ నుంచి దేశానికి విముక్తి లభించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
ఖార్కివ్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో.. ప్రజలు ఇండ్లకు చేరుకుంటున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. తమ దేశ సైనిక దళాలు రష్యా సైన్యాన్ని వెనక్కి పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో రష్యన్లు ఎక్కువగా మైన్లు ఏర్పాటు చేశారని, ఇండ్లకు తిరిగివస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఏడాది చివరకు యుద్ధం ముగింపు..
రష్యాతో జరుగుతున్న యుద్ధం ఈ ఏడాది చివరలో సమాప్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి తెలిపారు. ఆగస్టు మధ్యలో యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందని, ఇక ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగుస్తుందని అన్నారు. మేజర్ జనరల్ కిర్యోల్ బుదనోవ్ ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ఏడాది చివరి నాటికి పట్టుకోల్పోయిన అన్ని ప్రాంతాల్లో మళ్లీ శక్తిని సాధిస్తామన్నారు. రష్యా ఓడిపోవడం వల్ల పుతిన్పై తిరుగుబాటు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మానసికంగా, శారీరకంగా పుతిన్ చాలా బలహీనమైన స్థానంలో ఉన్నట్లు మేజర్ ఆరోపించారు.