భగీరథుడి స్ఫూర్తితో ఇంటింటికీ తాగునీరు
అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జంక్షన్, మే19: మహనీయుల ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. భగీరథ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏసీ మాట్లాడుతూ, భగీరథుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టిన పేరు, దీక్షా తత్వానికి ప్రతి రూపమని కొనియాడారు. కఠోర శ్రమ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నాలను భగీరథ ప్రయత్నాలుగా పేర్కొంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ సైతం భగీరథుడి స్ఫూర్తితో ఇంటింటికీ తాగునీరు అందించే దిశగా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేశారని వివరించారు. ఇక్కడ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, వసతి గృహ సంక్షేమాధికారులు అశోక్, అంజయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోల్సిటీ, మే 19: భగీరథ జయంతిని రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు స్థానిక బల్దియా కార్యాలయం ఆవరణలో భగీరథుడి చిత్రపటానికి నగర పాలక మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కమిషనర్ ఉదయ్ కుమార్ వేర్వేరుగా పూలమాలలు వేసి ప్రార్థనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి భౌతిక దూరం పాటిస్తూ ఈ వేడుకలు చేసుకున్నారు.
అంతర్గాం, మే 19: అంతర్గాం తహసీల్ కార్యాలయంలో భగీరథ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ చిత్ర పటానికి తహసీల్దార్ బండి ప్రకాశ్ పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ అజీమ్, మల్లికార్జున్, కార్యాలయ సిబ్బంది నిహారిక, వనిత, మహేందర్ పాల్గొన్నారు.