న్యూఢిల్లీ: ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అల్ అరేబియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, పాక్కు శాంతి కావాలని, కానీ కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను ఆపాలని షెహబాజ్ కోరారు. కశ్మీర్ అంశం నిత్యం రగిలేదని, అలాంటి అంశాలపై కుర్చుని మాట్లాడుకోవాలని, భారత ప్రధానితో ఆ చర్చలు ఆశిస్తున్నట్లు షెహబాజ్ తెలిపారు.
భారత్తో మూడు యుద్ధాలు చేశామని, కానీ ఆ యుద్ధాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగినట్లు ఆయన వెల్లడించారు. మేం గుణపాఠం నేర్చుకున్నామని, ఇప్పుడు ఇండియాతో శాంతి కాంక్షిస్తున్నామని, మన సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. తమ వద్ద ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణం ఉన్న కార్మికులు ఉన్నారని, దేశ సౌభాగ్యం కోసం వాళ్లను వాడుకోవాలని, ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి కోసం ఆ చర్యలు తప్పవని, రెండు దేశాలు కూడా పురోగమిస్తాయని షరీఫ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. బాంబులు, ఆయుధాల సేకరణ కోసం తమ నిధుల్ని వృధా చేయాలని లేదని పాక్ ప్రధాని వెల్లడించారు.