ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడానికి డబ్బుల్లేవు అని నిన్న ఓ పాకిస్థాన్ మంత్రి తమ ప్రజలకు ఇటీవల పిలుపునిచ్చారు. కరెంటు, ఆయిల్ అనవరంగా వేస్ట్ చేయవద్దని, రాత్రి సమయాల్లో దుకాణాలు తొందరగా బంద్ చేయాలని పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోజువారీ ఖర్చులకు కూడా కటకటగా ఉందని పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై సబ్సిడీని ఎత్తివేసింది. వెరసి పాకిస్థాన్ శ్రీలంక బాటలో నడుస్తున్నది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. విదేశీ మారక నిల్వలు 2.9 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తమ లాహోర్ ఆరెంజ్ లైన్ ప్రాజెక్టుకు డబ్బులు చెల్లించాలని పాకిస్థాన్పై చైనా ఒత్తిడి చేస్తున్నది. వచ్చే ఏడాది నవంబర్లోగా చెల్లించాలని డెడ్లైన్ విధించింది. ఈ ప్రాజెక్టుకు పాకిస్థాన్ 55.6 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది.
చైనా అప్పు 4.2 బిలియన్ డాలర్లు
పాకిస్థాన్లో చైనా ఎన్నో పెట్టుబడులు పెట్టింది. లోన్లు ఇచ్చింది. మొత్తంగా చైనా నుంచి పాక్ 4.2 బిలియన్ డాలర్ల అప్పు తీసుకొన్నది. దీనికి 2021-22లో పాకిస్థాన్ 150 మిలియన్ డాలర్లను వడ్డీగా చెల్లించింది. 2019-20లో 120 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఏప్రిల్ నెలలో షెహబాబ్ పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చైనా తమ డబ్బు కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీనికి తోడు పాకిస్థాన్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. స్వదేశీ, విదేశీ విద్యుత్తు సంస్థలకు పాక్ 14 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఈ రంగంలో పాక్లో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీలు ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆందోళన చెందుతున్నాయి. చైనా విద్యుత్తు సంస్థలకు పాకిస్థాన్ 1.3 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది.
కరాచీలో 9 గంటలకల్లా మార్కెట్లు మూత
ఇంధన సంక్షోభం నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆయిల్, విద్యుత్తును పొదుపు చేసేందుకు నైట్లైఫ్కు ప్రసిద్ధి చెందిన కరాచీ నగరంలో ఆంక్షలు విధించింది. రాత్రి 9 గంటలకల్లా నగరంలోని అన్ని మార్కెట్లు, బజార్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, అదేవిధంగా రాత్రి 10.30 సమయంలోపు పెండ్లి మండపాలు, రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించింది. ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని హోంశాఖ కార్యదర్శి అహ్మద్ మాంగ్నెజో తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిన ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇటీవల ఎడాపెడా కరెంట్ కోతలతో కరాచీ వాసులు నిద్ర లేని రాత్రులు గడిపారు. గంటల తరబడి విద్యుత్ కోతలను నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన పరిస్థితులు ఉన్నాయి.
లంకలో ప్రభుత్వ ఆఫీసులు మూత
కొలంబో: శ్రీలంకలో ఇంధన సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలకు వారం రోజుల పాటు లంక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ సెలవులు అమల్లోకి రానున్నాయి. అన్ని పాఠశాలలు కూడా నడపొద్దని, తరగతులు ఆన్లైన్లోనే నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దేశంలో నెలకొన్న ఇంధన కొరత కారణంగానే లంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెబుతున్నారు. సెలవులు ప్రకటిస్తే పెట్రోల్, డీజిల్కు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం యోచిస్తున్నది. చమురు దిగుమతులకు విదేశీ మారకం కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న శ్రీలంకంలో ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి. దీంతో దేశంలోని అన్ని రంగాలు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి.