X account withheld | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది. జమ్ము కశ్మీర్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాక్ రక్షణ మంత్రి (Pakistan Defence Minister) ఖవాజా అసీఫ్ (Khawaja Asif) ఎక్స్ ఖాతాను భారత్లో బ్లాక్ చేసింది (X account withheld).
అంతకుముందు భారత్లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను (Pakistan Governments X Account) కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించినట్లు తెలిసింది. అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
ఈనెల 22న మధ్యాహ్నం జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్ చేసింది. పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేత దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Also Read..
Terrorism | పాక్ నిజస్వరూపం బట్టబయలు.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు ఒప్పుకున్న దాయాది దేశం
మాపై భారత్ సైనిక దాడి అనివార్యం