X Account Blocked | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతుల్లా తరార్ (Ataullah Tarar) ఎక్స్ అకౌంట్ను (X Account Blocked ) భారత్లో నిలిపివేసింది.
భారత్పై అతుల్లా తరార్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్పై భారతదేశం యుద్ధం చేయబోతుందంటూ వ్యాఖ్యానించారు. గత నెల 30వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన ప్రెస్ మీట్పెట్టి మాట్లాడారు. రాబోయే 24-36 గంటల్లో పాకిస్థాన్పై భారతదేశం దాడి చేస్తుందని.. సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే చట్టపరమైన కారణాల వల్ల ఆయన సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.
గత నెల 22న పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించినట్లు తెలిసింది.
అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్, ది పాకిస్థాన్ రెఫరెన్స్ తదితర యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. జమ్ము కశ్మీర్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో భారత్ చర్యలు చేపడుతోంది.
ఈనెల 22న మధ్యాహ్నం జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్ చేసింది. పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేసింది.
Also Read..
పాక్ ప్రధాని యూట్యూబ్ చానల్ సస్పెండ్
పాక్పై భారత్ దాడిచేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి
ఉగ్ర సంస్థలతో పాక్ సంబంధాలు రహస్యమేమీ కాదు