Pneumonia | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో న్యుమోనియా (Pneumonia) విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ సుమారు 10 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు వారాల్లోనే న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్స్ (Punjab province)లో 200 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు (Children Die).
ప్రావిన్స్లో జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 10,520 న్యుమోనియా కేసులు నమోదైనట్లు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. మొత్తం 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. వీరంతా ఐదేళ్ల లోపు పిల్లలేనని స్పష్టం చేసింది. పంజాబ్ రాజధాని లాహోర్ (Lahore)లోనే 47 మంది చనిపోయినట్లు ప్రకటించింది. అతిశీతల వాతావరణం కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది.
ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహారలోపం, న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారేనని స్పష్టం చేసింది. ఇక గతేడాది పంజాబ్ ప్రావిన్స్లో న్యుమోనియా కారణంగా 990 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు శీతల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జనవరి 31వరకు పంజాబ్ ప్రావిన్సులో పాఠశాలలు ఉదయం తెరుచుకోవడంపై ప్రభుత్వం (ఆపద్ధర్మ ప్రభుత్వం) నిషేధం విధించింది.
Also Read..