Washington DC Plane Crash | వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన చేసింది. ఆర్లింగ్టన్లో గురువారం ఉదయం 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం యూఎస్ ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొట్టింది. విమానం, హెలికాప్టర్ పొటోమాటిక్ నదిలో కుప్పకూలాయి. ఘటనపై అమెరికా అధికారిక ప్రకటన చేసింది. ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. 60 మందికిపైగా మరణించి ఉంటారని భావిస్తున్నామని డీసీ ఫైర్ ఆఫీసర్ జాన్ డొన్నెల్లీ తెలిపారు. ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 28 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. దశాబ్దంలో అమెరికాలో జరిగిన ఘోర విమాన విపత్తుగా పేర్కొన్నారు.
ఘటనలో మృతదేహాలను వెలికి తీసి బంధువులకు అప్పగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఘటనలో 67 మంది మరణించినట్లుగా భావిస్తున్నామన్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సమయం పడుతుందన్నారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు ప్రస్తుతం ఆపరేషన్ నిర్వహిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జెట్ విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లుగా అమెరికన్ ఎయిర్లైన్స్ ధ్రువీకరించింది. శిక్షణలో ఉన్న హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నట్లుగా ఓ అధికారులు పేర్కొన్నారు. విమానంలో ప్రయాణికుల్లో ఐస్ స్కేటర్స్, వారి కుటుంబీకులు, కోచ్లో ఉన్నారు. ఇందులో రష్యాలో జన్మించిన మాజీ ప్రపంచ చాంపియన్స్ యెవ్జెనియా షిష్కోవా, వాడిమ్ నౌమోవ్ ఉన్నారు.
అంతర్జాతీయ మీడియా ప్రకారం.. డైవ్ బృందం విమానం నుంచి రెండు డేటా రికార్డర్లలో ఒకదాన్ని, బ్లాక్ బాక్స్లను స్వాధీనం చేసుకుంది. పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కాన్సాస్లోని విషిటా నుంచి బయలుదేరగా.. బుధవారం రాత్రి 8.30 గంటలకు రోనాల్డ్ రీనగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేందుకు వస్తున్న సమయంలో డిఫెన్స్కు చెందిన బ్లాక్హాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనపై పెంటగాన్ దర్యాప్తు జరుపుతుందని అమెరికా రక్షణ కార్యదర్శి సీన్ డఫీ పేర్కొన్నారు. సైనిక హెలికాప్టర్.. పీఎస్ఏ విమానం మార్గంలోకి ఎందుకు వచ్చిందో తెలియలేదన్నారు.
Airplane Crash | హెలికాప్టర్ను ఢీకొట్టిన విమానం.. 18 మంది మృతి