Chinese balloon | తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా ఇటీవల కూల్చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం అట్లాంటిక్ సముద్రంలో ఆ బెలూన్ను కూల్చివేశారు. అయితే, సముద్రంలో తేలియాడుతున్న కొన్ని శకలాలను అమెరికా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. నీటిలో మునిగిన శకలాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
‘చైనా గూఢచర్య బెలూన్ శకలాలను వెలికి తీసే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా శకలాల వెలికితీత పనుల్లో జాప్యం జరుగుతోంది. వాతావరణం అనుకూలించగానే సముద్రం అడుగున పడిపోయిన శకలాలను గుర్తించి వెలికి తీస్తాం’ అని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
మరోవైపు సముద్రం నుంచి వెలికితీసిన బెలూన్ శకలాలను చైనాకు అప్పగించే ఉద్దేశమేమీ తమకు లేదని వైట్ హౌజ్ సోమవారం ప్రకటించింది. ‘బెలూన్ను తమ గగనతలంలోకి పంపించి చైనా గూఢచర్యానికి పాల్పడింది. ఇది కవ్వింపుచర్యే. అమెరికా భూభాగంలోని కీలక మిలటరీ స్థావరాలు, రక్షణ శాఖకు చెందిన కీలక ప్రాంతాల పైనుంచి చైనా బెలూన్ ప్రయాణించింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బెలూన్ను రూపొందించారు. ఇది తప్పకుండా గూఢచర్యం చేయడానికే మా గగనతలంలోకి ప్రవేశించింది. ఇది సేకరించిన సమాచారం ఏంటనేది ఆ శకలాలను పరిశీలించాకే తెలుస్తుంది. అందుకే శకలాలను వీలైనంత తొందరగా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని కిర్బీ వెల్లడించారు.
అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు శుక్రవారం అట్లాంటిక్ సముద్రంలో అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను కూల్చివేశారు. అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్-22ను రంగంలోకి దించిన ఆమెరికా.. ఎయిర్ ఇంటర్సెప్ట్ క్షిపణి 9 ఎక్స్ సైడ్విండర్ను ప్రయోగించి చైనా నిఘా బెలూన్ను పేల్చివేసింది. ప్రస్తుతం అమెరికా సైన్యం ఆ బెలూన్ శకలాలను సేకరించే పనిలో పడింది. ఓ భారీ క్రేన్తో కూడిన రెండు నౌకాదళ షిప్లు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. శకలాల ఆధారంగా నిఘా అంశంపై అమెరికా ఓ నిర్ధారణకు రానున్నది. ఈ బెలూన్ పౌర గగన నౌక అని, వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించిన ఈ బెలూన్ దారితప్పిందని చైనా చెబుతుండగా.. తమ దేశంలోని వ్యూహాత్మక స్థావరాలపై నిఘా పెట్టేందుకు చైనా దీన్ని ప్రయోగించిందని అమెరికా పేర్కొంటోంది.