నెపితా: మయన్మార్లో సైనిక ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. స్థానిక ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న జుంటా సైనికులు.. అక్కడ భారీ స్థాయిలో హింసకు పాల్పడుతున్నారు.
ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పునర్ స్థాపించాలని మరోవైపు ప్రపంచ దేశాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మయన్మార్తో అమెరికా వాణిజ్య బంధాలను తెంచుకున్నది. ఆ దేశంలో హింసను ఆపాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రపంచ దేశాలను కోరారు. ఆందోళనకారులు నిర్వహిస్తున్న ప్రదర్శనలను సైనికులు భీకర స్థాయిలో అణిచివేస్తున్నారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో దాడి చేస్తున్నారు. ఆ రక్తపాతంలో నిరసనకారులు అసువులు బాస్తున్నారు. సైనిక తిరుగుబాటు వల్ల ఇప్పటివరకు 510 మంది పౌరులు మృతిచెందినట్లు ద అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజినర్స్(ఏఏపీపీ) పేర్కొన్నది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా హెచ్చరించింది. ఫిబ్రవరి ఒకటో తేదీన మయన్మార్ సైన్యం తిరుగుబాటు ప్రకటించింది. ఆంగ్సాన్ సూకీ పార్టీ నేతలను దిగ్బంధం చేసింది. ఆ రోజు నుంచి ఆ దేశంలో హింస పెట్రేగింది.