కీవ్ : ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యన్ అణిచివేత సోమవారం 19వ రోజుకు చేరుకుంది. కీవ్ రైల్వేస్టేషన్ వద్ద పలుచోట్ల పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. కీవ్ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ శివారు ప్రాంతాల్లో రష్యా బలగాలు ఆదివారం రాత్రి నుంచి కాల్పులు జరుపుతూ లక్ష్యాల దిశగా కదులుతున్నాయి. యుద్ధంలో కీవ్ బ్రావరీ ఈస్ట్ పట్టణ కౌన్సెలర్ మరణించాడని ఉక్రెయిన్ టీవీలో ప్రాంతీయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఒలెక్సి కులెబ పేర్కొన్నారు.
గత రాత్రి నుంచి ఇర్పిన్, బుచా, హస్తోమెల్ పట్టణాల్లో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు రష్యాకు చైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా డ్రాగన్ను హెచ్చరించింది. ఉక్రెయిన్పై దాడికి దిగిన తర్వాత చైనా సైనిక సహాయాన్ని రష్యా కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి అభ్యర్థన గురించి తమకు సమాచారం లేదని వాషింగ్టన్లోని చైనా ఎంబసీ తెలిపింది.
ఇక ఇవాళ రోమ్ నగరంలో అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులను ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సైనికులతో కాసేపు ముచ్చటించి వారికి మెడల్స్, టైటిల్స్ అందించారు. సైనికులు కోరడంతో వారితో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ఈ ఫొటోలను ఉక్రెయిన్ రక్షణశాఖ ట్విట్టర్లో షేర్ చేసింది.