ధారూరు, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మండల పరిధిలోని కుమ్మరి పల్లి గ్రామ రూపురేఖలు మారాయి. నూతన ఏర్పడిన గ్రామ పంచాయతీ అయినప్పటికీ గ్రామంలో ప్రతి ఇం ట్లో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత, భగీరథతోనీరు, వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, పంచాయతీకి ట్రాక్టర్ సైతం సమకూరింది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజా ప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యులు, గ్రామస్తులతో పాటు అధికారుల సమన్వయంతో గ్రామంలో ఎంతో అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టారు.
పారిశుధ్య నిర్వహణతో వీధులు పరిశుభ్రం
పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీకి ట్రాక్టర్ను కొనుగోలు చేసి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రతి వీధి స్వచ్ఛంగా కనిపిస్తున్నది. అంతే కాకుండా ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. గతంలో తాగునీరు కావాలంటే పంట పొలాల నుంచి తెచ్చుకునే గ్రామస్తులు నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు వస్తుండ డంతో ఎంతో సంతోష పడుతున్నారు. అంతేకాకుండా 30రోజుల ప్రణాళిక, గ్రామంలో పురాతన ఇండ్లను, పాడుబడ్డ బావులను పూడ్చివేశారు.
గ్రామంలో పచ్చదనం..
పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలోని నర్సరీలో 11వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలను హరితహారంలో భాగంగా ఖాళీ స్థలాల్లో నాటడంతో గ్రామంలో పచ్చదనం వెల్లువిరుస్తున్నది. నాటిన మొక్కకు ప్రతి దినం నీరు అందించి కంటికి రెప్పల కాపాడుకుంటున్నారు.