వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో జరిగిన దాడుల( Kabul Blasts )పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఈ కాబూల్ దాడులు జరిగేవే కావని ఆయన అనడం గమనార్హం. ట్రంప్ శుక్రవారం అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఒకవేళ నేను మీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ విషాదం ఎప్పటికీ జరిగి ఉండేది కాదు. ఎప్పటికీ జరిగేది కాదు. ఇలాంటిది అసలు జరగదు అని ట్రంప్ అన్నారు. గురువారం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన విషయం తెలిసిందే.