Lunar mission | టోక్యో, ఆగస్టు 27: ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయత్తమవుతున్నది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) పేరిట జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా నేడు (సోమవారం) చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపించనున్నది.
జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి హెచ్2-ఏ రాకెట్ సోమవారం నింగిలోకి దూసుకెళ్లనున్నది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో చేస్తున్న ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించనున్నది. కాగా, ప్రయోగించిన 3-4 నెలల తర్వాత ఈ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనున్నది.