జెరూసలేం: ఇజ్రాయెల్లో మరోసారి కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నది. ఈ నెల 2న ఆ దేశంలో రికార్డు స్థాయిలో 11,316 కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా మంది ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఆగస్ట్ 7 నుంచి సెప్టెంబర్ 4వరకు కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన సీరియస్ కేసుల సంఖ్య గరిష్ఠంగా 751కు చేరింది. కాగా, ఇజ్రాయెల్లోని మొత్తం జనాభాలో 61 శాతం మంది ఫైజర్ బయోఎంటెక్ టీకా రెండు డోసులు పొందారు. తాజాగా పిల్లలకు కరోనా టీకాతోపాటు పెద్దలకు బూస్టర్ డోస్ కూడా వేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 4 వరకు గత వారంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇజ్రాయెల్లో అత్యధిక తలసరి కరోనా కేస్ లోడ్ నమోదైంది. ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపింది.
కాగా, టీకాలు తీసుకోని వారు, ముఖ్యంగా 12 ఏండ్లలోపు పిల్లలు కరోనా బారిన పడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. టీకా సామర్థ్యం తక్కువగా ఉండటం, రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా దీనికి కారణమని చెప్పారు. స్కూళ్లు తెరువడంతో పిల్లులు కరోనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు.