గాజా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతూనే ఉన్నది. హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. దీంతో హమాస్కు ప్రధాన స్థావరంగా గాజా స్ట్రిప్ (Gaza Strip) అనునిత్యం బాంబుల మోతలతో దద్దరిళ్లుతున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భాగంగా గత 48 గంటల్లో 350 మందిని ఇజ్రాయెల్ సైన్యం చంపేసిందని హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ హాస్పిటల్లో (Nasser Hospital) మరణించిన వారిని స్థానికులే ఖననం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నది. ఇజ్రాయెల్ సైన్యం హాస్పిటల్ను ముట్టడించిందని, దీంతో రోగులకు తగిన వైద్య సాయం అందకుండా పోయిందని చెప్పింది. కాగా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గతేడాది అక్టోబర్ 3న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడితో గాజాలో ఇప్పటివరకు 26,422 మంది పాలస్తీనియనల్లు మరణించారు. మరో 65,087 మంది గాయపడ్డారు. లక్షలాది మంది నగరాన్ని వదిలివెళ్లిపోయారని హమాస్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.