Israel-Iran | టెహ్రాన్/టెల్అవివ్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఊహించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. అయితే ‘బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ’ను ఉపయోగించి.. ఇరాన్ ప్రయోగించిన 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల్లో 99 శాతం కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఇరాన్ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఆర్మీ అధికార ప్రతినిధి డానియెల్ హగేరీ పేర్కొన్నారు. ఇరాన్ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. మొత్తంగా వీటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ భూభాగంపైకి వచ్చాయని, ఒక ఎయిర్ బేస్కు స్వల్ప నష్టం చేకూరిందని, అయితే అది ఇప్పటికీ పనిచేస్తుందని వెల్లడించారు. కాగా, తమ లక్ష్యాన్ని సాధించామని, ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మహ్మద్ హుస్సేన్ భగేరీ పేర్కొన్నారు. మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్ చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. రెండు వారాల క్రితం సిరియా రాజధాని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ తాజా దాడులు చేసింది.
ఇజ్రాయెల్లోని పలు భూభాగాలపైకి ఇరాన్ మద్దతు గల లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు, యెమెన్లోని హౌతీ రెబల్స్ కూడా పలు రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించారు. ఇరాన్ దాడుల్లో 12 మందికి గాయాలయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బెడౌయిన్ అరబ్ పట్టణంలో ఏడేండ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయని రెస్క్యూ బృందాలు తెలిపాయి. అయితే ఇరాన్ దాడులతో పాప గాయపడిందా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్షంగా దాడులు చేయడం ఇదే తొలిసారి. ‘మేం అడ్డుకొన్నాం. బ్లాక్ చేశాం. కలిసి విజయం సాధించాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్లో పోస్టు చేశారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉన్నదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ తెలిపారు. ఇరాన్ దాడిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా దళాలు సహకరించాయని, ఇజ్రాయెల్కు ‘ఇనుప కవచం’లా అండగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ ఎదురుదాడులు చేస్తే తాము భాగస్వామ్యం కాబోమని నెతన్యాహూతో బైడెన్ పేర్కొన్నట్టు సమాచారం.
ఇరాన్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ వార్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ ప్రత్యక్ష దాడిని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ గత కొన్నేండ్లుగా, ప్రధానంగా గతకొన్ని వారాలుగా సంసిద్ధమైందని నెతన్యాహూ పేర్కొన్నారు. తమకు హాని తలబెట్టిన వారికి తాము కూడా ఇదేరీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ప్రతిదాడులకు పాల్పడితే ఇజ్రాయెల్, అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కానీ, దాని మద్దతు దేశాలు గానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, బలమైన ప్రతిస్పందన తెలియజేస్తామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతకుముందు ఇరాన్ మిలటరీ చీఫ్ మహ్మద్ భగేరీ కూడా మాట్లాడుతూ ఇరాన్కు వ్యతిరేకంగా ప్రతిదాడులకు పాల్పడితే, ఇజ్రాయెల్ ‘అతిపెద్ద’ స్పందన కోసం వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడులకు సహకరిస్తే, అమెరికా సైనిక బేస్లను లక్ష్యంగా చేసుకొంటామని హెచ్చరించారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. పశ్చిమాసియా గానీ, యావత్తు ప్రపంచం కానీ మరో యుద్ధాన్ని భరించలేదని అన్నారు. సైనిక ఘర్షణలకు దారితీసే ఎలాంటి చర్యలకైనా దూరంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరారు. శత్రుత్వాన్ని వీడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ దాడులను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఇజ్రాయెల్కు అండగా ఉంటామని తెలిపారు. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఉక్రెయిన్ దేశాల నేతలు కూడా ఇజ్రాయెల్పై దాడులను ఖండించారు. దీంతో జర్మనీ, ఫ్రాన్స్, యూకే రాయబారులకు ఇరాన్ సమన్లు ఇచ్చింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాంతీయ శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, హింసకు దూరంగా ఉండాలని, దౌత్య మార్గంలో చర్చలు జరుపాలని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో కోరింది. మరోవైపు ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలోని భారతీయులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్లోని భారత పౌరులకు ఇండియన్ మిషన్లు ముఖ్యమైన అడ్వైజరీ జారీచేశాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు జారీచేసే సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలని సూచించాయి. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, భారతీయుల సురక్షితపై అధికారులు, ప్రవాస సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపాయి. వెబ్సైట్ లింక్ ద్వారా రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో టెల్అవివ్కు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ఆదివారం వెల్లడించింది.