న్యూఢిల్లీ, జూన్ 19 : లెబనాన్లో హిజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా తీవ్రవాద గ్రూపులు.. ఇవన్నీ ఇరాన్కు మిత్రులే.. ఇజ్రాయెల్కు శత్రువులగా ఉన్న వీటికి ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం కూడా అందిస్తున్నది. నాలుగు దశాబ్దాలుగా పశ్చిమాసియా అంతటా ఇరాన్ వీటన్నింటితో కలిపి ప్రచ్ఛన్న దళాలను నిర్మించింది. అమెరికా, ఇజ్రాయెల్తో తాను నేరుగా తలపడకుండా ఇరాన్ వీటిని ఎగదోస్తున్నది. కానీ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న ఇరాన్కు ఇవన్నీ కంటికి కానరానంత దూరంలో ఉండిపోయాయి. ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న తరుణంలో ఈ ఇరాన్ మిత్ర సంస్థలన్నీ అనుమానాస్పద రీతిలో మౌనం వహిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు గ్రూపులుగా విడిపోయాయి, మరికొన్ని తీవ్రంగా బలహీనపడ్డాయి, అంతర్గత పోరుతో సతమతమవుతున్నాయి. దీంతో ఇరాన్ ఒంటరిగా మిగిలిపోయినట్టు తెలుస్తున్నది.
ఇరాన్కు అత్యంత శక్తిమంతమైన మిత్రునిగా ఉన్న షియా పారామిలిటరీ గ్రూపు హిజ్బొల్లా సంస్థ ఇంతవరకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఎటువంటి చర్య చేపట్టలేదు. ఏడాది క్రితం ఎంతో శక్తిమంతంగా ఉన్న హిజ్బొల్లాను ఇజ్రాయెల్ గత ఏడాది చావుదెబ్బ కొట్టింది. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై హిజ్బొల్లా సంస్థ రాకెట్లు ప్రయోగించింది. దీంతో హిజ్బొల్లాకు సుదీర్ఘ కాలం నాయకునిగా ఉంటూ వచ్చిన హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆయన స్థానంలో నాయకుడిగా ఎంపికైన నయీం ఖాస్సెమ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ మిత్రునిగా కాకుండా లెబనాన్ ప్రతినిధిగానే మాట్లాడారు. ఆయన కార్యాలయంలో ఇరాన్ నాయకుడు ఖమేనీ చిత్రపటం అదృశ్యమైందని అమెరికా వార్తా పత్రిక పేర్కొంది. ఇరాన్ నుంచి అన్ని రకాలుగా సాయం పొందిన హమాస్ సంస్థ గత రెండేండ్లుగా ఇజ్రాయెల్తో పోరాటంలో పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. దాని సీనియర్ నేతలందరూ హతమయ్యారు. ఇక ఇరాక్లో ఇరాన్కు మిత్రులుగా ఉన్న షియా తీవ్రవాద గ్రూపులు గత జనవరి వరకూ అమెరికన్ సైనికులను వేధించేందుకు ఉపయోగపడ్డారు. కానీ జనవరిలో ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ బాంబులు వేయడంతో వీరంతా మన్ను తిన్న పాములా మారిపోయారు. ఇక యెమెన్లోని హౌతీలను గత మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా వైమానిక దాడులు చేసి పూర్తిగా నిర్వీర్యం చేసింది.
ఇరాన్కు పశ్చిమాసియా వెలుపల కూడా బలమైన మిత్రులు ఉన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఇరాన్కు మిత్రులే కాకుండా అత్యంత శక్తిమంతమైనవి కూడా. కానీ ప్రస్తుతం రష్యా ఆచితూచి స్పందిస్తున్నది. అది ఇంతవరకు ఇజ్రాయెల్ దాడులను ఖండించడం వరకే పరిమితమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తున్న చైనా పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. కానీ ప్రస్తుతం అది మధ్యవర్తిత్వం వహించడానికే మొగ్గు చూపుతున్నది. ఇరాన్ అణు కార్యక్రమానికి, క్షిపణుల ఉత్పత్తికి సహాయపడినట్టు ఆరోపణలున్న ఉత్తరకొరియా మాత్రం ఇంతవరకు తన వైఖరిని వెల్లడించలేదు. భారత్ ఇటు ఇరాన్తో అటు ఇజ్రాయెల్తో సంబంధాలను నెరుపుతున్నది. ఇజ్రాయెల్తో అనేక రంగాల్లో భాగస్వామిగా ఉన్న భారత్ ఇరాన్కు ప్రాంతీయ, వ్యూహాత్మకంగా భాగస్వామిగా ఉన్నది. ఇరాన్లోని పోర్టును అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్టును సైతం కుదుర్చుకున్నది.