Drone attack: సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడిందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నాసిర్ కనానీ ఒక ప్రకటన విడుదల చేశారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తున్న సహకారం నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ విమర్శించింది. వాణిజ్య నౌకపై దాడి ఇరాన్ భూభాగం పైనుంచే జరిగిందని పెంటగాన్ వెల్లడించిన మరుసటి రోజే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులతో తమకు సంబంధం లేదంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహిన్ ఇటీవల మాట్లాడుతూ.. యెమెన్ నుంచి ఎర్రసముద్రంపై జరిగే దాడులతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఒకవేళ తామే దాడి చేస్తే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తామని చెప్పారు. 2020లో అల్ అసద్ బేస్పై దాడి చేసిన సమయంలో తాము వ్యవహరించిన విధానాన్ని అమెరికా ప్రత్యక్షంగా చూసిందని ఆయన గుర్తుచేశారు.
కాగా, భారత్కు వస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నుంచి 21 మంది భారతీయులతోపాటు మొత్తం 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడి విషయాన్ని తొలుత యూకే మారిటైమ్ ఏజెన్సీ వెల్లడించింది.