వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో మెట్టు దిగారు. యూఎస్-ఇజ్రాయెల్తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్లైన్ను మరోసారి పొడిగించారు. గతంలో తాను ఇచ్చిన 48 గంటల డెడ్లైన్ను ఉపసంహరించి ఇరాన్కు మరో ఐదు రోజులు గడువిస్తున్నట్టు ఈ నెల 23న ట్రంప్ ప్రకటించారు. అయితే దానికి స్పందన లేకపోవడంతో మరోసారి తన గడువు పొడిగించారు. ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని ఏప్రిల్ 6వ తేదీ 8 పీఎం వరకు దానికి డెడ్లైన్ విధిస్తున్నట్టు గురువారం ప్రకటించారు.
ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ తిరస్కరించడమే కాక, తమ డిమాండ్లను అమెరికా ముందు ఉంచి, అవి నెరవేరుస్తానంటేనే యుద్ధ విరమణ చేస్తామని పేర్కొంది. ఈ విషయంలో ఆ దేశంతో నేరుగా ఎలాంటి చర్చలు జరపమని, దీనిపై రాజీపడబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలకు చెందిన వాణిజ్య నౌకల రాకపోకలను హొర్ముజ్ జలసంధి మీదుగా అంగీకరించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పునరుద్ఘాటించింది. కాగా, ‘ఫేక్ న్యూస్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి’ అని ట్రంప్ తాజాగా ఓ పోస్ట్లో పేర్కొన్నారు.