జకార్తా : హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వెల్లడించారు. జీవితంలో ఒక్కసారైనా హజ్ తీర్థయాత్రకు వెళ్లిరావాలనేది ప్రతీ ముస్లిం కోరిక. కాగా కోటా విధానం కారణంగా సగటున 20 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని క్యాబినెట్ సెక్రటేరియట్ తెలిపింది.
కరోనా మహమ్మారి కారణంగా యాత్రికుల భద్రత నిమిత్తం ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సౌదీ అరేబియా సైతం హజ్కు ప్రవేశం కల్పించలేదని చెప్పారు. ఇది ఇండోనేషియాకు మాత్రమే పరిమితం కాదని ఇతర దేశాలకు కోటాలు కల్పించలేదన్నారు. ఇప్పటికే హజ్ ఫీజులు చెల్లించినవారు వచ్చే ఏడాది యాత్రికులు అవుతారన్నారు.
కాగా 11 దేశాల నుంచి వచ్చే యాత్రికులకు మాత్రం నిషేధాన్ని సౌదీ అరేబియా గడిచిన శనివారం ఎత్తేసింది. కాకపోతే వీరు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. సుమారు 2.5 మిలియన్ల మంది యాత్రికులు ఇస్లాం పవిత్ర స్థలాలు మక్కా, మదీనాను ఏడాది పొడవునా సందర్శిస్తుంటారు. అధికారిక డేటా ప్రకారం ఆ దేశానికి 12 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది.