Israel : ఇరాన్పై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోని, ఇటు ఇజ్రాయెల్లోని భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీలక సూచనలు జారీచేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్లోని రాయబార కార్యాలయం ఒక అప్డేట్ ఇచ్చింది. భారతీయులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీచేసే సేఫ్టీ గైడ్లైన్స్ను అనుసరించాలని సూచించింది.
ఇజ్రాయెల్లోని హోం ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్ను భారతీయులు రెగ్యులర్గా చెక్ చేస్తూ, వారిచ్చే సూచనలను అనుసరించాలని ఆదేశించింది. యుద్ధ సమయంలో తాము నివసించే లేదా పని చేసే ప్రదేశం నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక కేంద్రాలకు దగ్గరగా ఉండాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అత్యవసర ప్రయాణాలు తప్ప సాధారణ ప్రయాణాలు మానుకోవాలని కూడా భారతీయ రాయబార కార్యాలయం చెప్పింది. స్థానిక వార్తలు, ప్రకటనలు, ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని, రక్షణ పరమైన స్థితిగతులను అంచనా వేయాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచించింది. ఇక.. ఇరాన్లో ఉన్న భారతీయులకు కూడా అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఇదే తరహా హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది.
భారతీయులకు రెండు దేశాల్లోని రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. శనివారం ముందుగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి జరపగా.. ప్రతిదాడిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై మిస్సైల్స్ దాడి చేస్తోంది. అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అక్కడ సైరన్లు మోగించింది. ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది.