ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులు
స్వదేశానికి రప్పించాలని కేంద్రానికి మొర
తెలంగాణ విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
హెల్ప్ లైన్ కేంద్రాల ఏర్పాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్లి తల దాచుకోవాలో కూడా అర్థం కావట్లేదని పేర్కొంటున్నారు. ‘మేం 10-15 రోజులుగా టెన్షన్లోనే ఉన్నాం. గురువారం ఉదయం 5 గంటలకు కీవ్ సెంటర్లో రెండు బాంబులు పేలాయి. తర్వాత గంటన్నరకు బ్రూవరీ ప్లేస్లో రెండు బాంబులు పేలాయి. ఇది చాలా భయాన్ని కలిగిస్తున్నది. మేం ఉన్న ఏరియాలో కొద్దిగా నార్మల్గా ఉంది. నిత్యావసరాలను రెండుమూడు వారాలకు సరిపడా తెచ్చి పెట్టుకొన్నాం. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇండియాకు వద్దామన్నా రాలేం. ఎయిర్పోర్టు బ్లాక్ చేశారు. ఫ్లైట్లు ఆపేశారు. చాలా భయంగా ఉంది.’ అని ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థిని శెట్టిపల్లి సంహిత వివరించారు.
టికెట్లు బుక్ చేసుకొన్నారు.. కానీ
కొద్ది రోజులుగా ఉక్రెయిన్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు విమాన టికెట్లు బుకింగ్ చేసుకొన్నారు. గురువారమే ఇండియాకు రావడానికి ప్రణాళికలు వేసుకొన్నారు. అయితే, అనూహ్యంగా రష్యా దాడి చేయడం, ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో వీరంతా రాజధానీ కీవ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం కీవ్లో పరిస్థితులు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని అక్కడి నుంచి విద్యార్థులు ఫోన్లలో చెప్పడం, భారత రాయబార కార్యాలయ అధికారులు విద్యార్థులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండటం కొంత ఊరట కలిగిస్తున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకుపోయినతెలంగాణ విద్యార్థులు.. వీరే