అటవీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్
అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద పికెటింగ్లు
మావోయిస్టు బంద్ నేపథ్యంలో అప్రమత్తం
కాళేశ్వరం, ఏప్రిల్ 24 : చాలా కాలం తర్వాత మళ్లీ జిల్లా సరిహద్దులో మావోయిస్టుల అలజడి కనిపిస్తోంది. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఘటన నేపథ్యం నుంచి మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, పోలీస్ యం త్రాంగానికి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా యి. ఈ నేపథ్యంలో సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో నక్సలైట్లకు కేంద్ర బిందువుగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో హై అలర్ట్ విధించారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టు నక్సలైట్లు ఉనికి చాటుకునే వ్యూహంతో జిల్లాలోకి ప్రవేశించారన్న సమాచారంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన మహదేవపూర్, పలిమెల, కాటారం, మహాముత్తారం మండలాలను పోలీస్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నుంచి కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ఎస్సై నరహరి ఆధ్వర్యంలో పికెటింగ్లు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేశారు. అవతలి ప్రాంతం మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల నుంచి మావోయిస్టు మాజీ నక్సలైట్లను వాకబు చేస్తూ నక్సలైట్ల కదలికపై అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పలు రాజకీయ పార్టీల నాయకులు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ అధికారులు సంకేతాలు పంపించారు. మారుమూల గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఉండొద్దని సూచనలు జారీ చేస్తున్నారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు సీ.ఐలు, ఎస్సైలు ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ను ముమ్మరం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే ఎవరూ ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై నిఘా వేసి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నక్సల్స్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధమై కూంబింగ్తో పాటు ప్రధాన రహదారుల వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.