జెరూసలేం: గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది. ఉత్తర గాజాలో 150 సొరంగాలు, బంకర్లను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థపై కూడా దాడులు చేయడంతో దాదాపు 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ దాడులను సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొంటామని హమాస్ తెలిపింది. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ శనివారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటు వేశాయి. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. ఐరాస భద్రతా మండలిలో భారత్ ప్రతినిధి మాట్లాడుతూ ఇజ్రాయెల్పై హమాస్ దాడిని తప్పనిసరిగా ఖండించాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశం ఉండాలని తెలిపారు. ఈ తీర్మానంలో వీటి ప్రస్తావన లేదన్నారు. ఐరాసలో భారత్ వైఖరిని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి.
హమాస్ వైమానిక దళాధిపతి హతం!
శుక్రవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ వైమానిక దళాధిపతి ఇస్సామ్ అబూ రుక్బే హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది.