Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
1,600 మందికిపైగా మృతి..
మరోవైపు హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రెండు వైపులా 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు వేల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.
హమాస్కు ఘాటు హెచ్చరికలు
మరోవైపు హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) ఘాటు హెచ్చరికలు చేశారు. హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమపై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామంటూ హమాస్కు గట్టిహెచ్చరికలు చేశారు.
‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ యుద్ధాన్ని మేము ప్రారంభించనప్పటికీ.. ముగించేది మాత్రం ఇజ్రాయెలే. మా ప్రతిదాడి హమాస్తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తిండిపోతుంది. ఇజ్రాయెల్పై దాడితో హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడింది’ అంటూ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థేనని నేతన్యాహు వ్యాఖ్యానించారు. ప్రజలంతా కలిసికట్టుగా దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపునా ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు.
Also Read..
Israel-Hamas War | రాత్రికి రాత్రే గాజాలో 200 మిలిటెంట్ స్థావరాలపై దాడిచేసిన ఇజ్రాయెల్ సైన్యం
Israel-Hamas War | హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో