India-Nepal border | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో పరిస్థితి అదుపుతప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను నిరసనగా యువత చేపట్టిన ఆందోళనలకు రాజకీయ సంక్షోభం తలెత్తింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేసినప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి అధ్వానంగా మారింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారత్-నేపాల్ బార్డర్ (India-Nepal border) వద్ద పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లోని నేపాల్ సరిహద్దు పానిటాంకి వద్ద పోలీసు పోస్టును ఏర్పాటు చేశారు. అక్కడికి అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్పీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. బార్డర్ వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
భారతీయులకు కీలక అడ్వైజరీ
మరోవైపు యువత ఆందోళనతో భారత్ (India) అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ప్రకటనలో తెలిపింది.
Also Read..
KP Sharma Oli | నేపాల్లో కొనసాగుతున్న హింస.. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా
Nepal | నేపాల్ ప్రధాని ఓలి నివాసానికి నిప్పు.. పలువురు మంత్రులు, నేతల ఇండ్లకు కూడా.. VIDEOS