India-Bangladesh : ఇండియా-బంగ్లాదేశ్ మధ్య కొంతకాలం క్రితం విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో ఈ పరిణామాలు కాస్త మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ అవసరం ఇండియాకు పెద్దగా లేకపోయినా.. ఇండియా అవసరం బంగ్లాకు ఉంది. అదే సమయంలో ఇండియా కూడా బంగ్లాదేశ్ అంశంలో సానుకూలంగానే స్పందిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్కు ఇండియా 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఒక పక్క ఇరాన్ వార్ జరుగుతుండగా సరఫరా చేయడం విశేషం.
గతంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చమురు సరఫరాపై ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఇరు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ పైప్లైన్ కూడా నిర్మించారు. అంతకుముందు చమురు సరఫరా రైల్వే ట్యాంకర్ల ద్వారా జరిగేది. బంగ్లాతో ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది బంగ్లాకు 1,80,000 టన్నుల డీజిల్ను ఇండియా సరఫరా చేయాలి. ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. దీనిలో భాగంగా తొలి విడతగా 5,000 టన్నుల డీజిల్ను ఇండియా బంగ్లాకు సరఫరా చేసింది. మంగళవారం నాటికి ఈ డీజిల్ బంగ్లాకు చేరుకుంటుందని అంచనా. అలాగే వచ్చే ఆరు నెలల్లో 90,000 టన్నుల డీజిల్ సరఫరా అవుతుందని భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ ముహమ్మద్ రెజనూర్ రెహమాన్ అన్నారు. ఇది తమ దేశీయ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
నిజానికి ఇండియా ఎప్పటినుంచో బంగ్లాకు చమురు సరఫరా చేస్తోంది. అలాగే, ఇక్కడి నుంచి విద్యుత్ను కూడా బంగ్లాక అందించేది. కానీ, రెండేళ్లక్రితం అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక పరిస్తితులు మారిపోయాయి. అక్కడ హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఇంతకాలం బంగ్లాను నడిపించిన యూనస్ ప్రభుత్వం ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇండియానుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది. అలాగే అదానీ సంస్థకు చెందిన ఝార్ఖండ్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ తీసుకోవడాన్ని తగ్గించింది. కానీ, ఇప్పుడు బంగ్లాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతుల్లోనే ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చమురు సరఫరా మొదలైంది.