సియోల్, డిసెంబర్ 7: రోజూ 4 గంటలకు పైగా స్మార్ట్ఫోన్ను వాడే కౌమార వయస్కులు(10-19 ఏండ్లు) మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొంది. స్మార్ట్ఫోన్ వాడకం వల్ల నిద్రలేమి, కండ్ల సమస్యలు, కండరాల సమస్యలు వస్తాయని గత పరిశోధనలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో కౌమార వయస్కుల స్మార్ట్ఫోన్ వాడకం, వారి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనేందుకు హనియంగ్ యూనివర్సిటీ వైద్య కేంద్రం 50 వేల మంది సమాచారాన్ని విశ్లేషించింది.
స్మార్ట్ఫోన్ వాడకానికి వయసు, లింగం, సామాజిక ఆర్థిక పరిస్థితులకు ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం చర్చించింది. రోజుకు నాలుగు గంటల కంటే తక్కువగా స్మార్ట్ఫోన్ వాడే కౌమార వయస్కులతో పోలిస్తే నాలుగు గంటల కంటే ఎక్కువ వాడేవారిలో ఒత్తిడి స్థాయి, ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువని వెల్లడించింది.