Israel-Hamas War | రెండు వారాల క్రితం ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిపై హమాస్ ఉగ్రవాదులు కాస్తంత దయ చూపారు. భీకర దాడుల సమయంలో బందీలుగా చేసుకున్న సుమారు 200 మందిలో ఇద్దరు అమెరికన్లను (American Hostages) తమ చెర నుంచి విడిచిపెట్టారు.
జుడిత్ తై రానన్, ఆమె కుమార్తె 17 ఏళ్ల నటాలీ శోషనా రానన్ను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదుల చెర నుంచి విముక్తిపొందిన ఆ ఇద్దరు అమెరికన్లు శుక్రవారం రాత్రి ఆలస్యంగా ఇజ్రాయెల్ చేరుకున్నట్లు తెలిపింది. అయితే, వారి ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి వివరాలూ ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించలేదు. అమెరికన్లను విడుదల చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు తమ వద్ద బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు కూడా ప్రకటించారు. మానవతాదృక్పథంతో ఈ ఇద్దర్నీ విడుదల చేసినట్లు ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఖతార్, ఈజిప్టులతో సంప్రదింపుల అనంతరం మానవతా కోణంలో భాగంగా అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ విడుదల చేసినట్లు టెలిగ్రామ్లో పోస్టు చేసింది. విడుదలైన తల్లీకూతుళ్లను గాజా సరిహద్దులో ఓ ఇజ్రాయెల్ రాయబారి కలుసుకున్నారు. వారిని సెంట్రల్ ఇజ్రాయెల్లోని సైనిక స్థావరానికి తరలించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై మెరుపుదాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు సుమారు 200 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఇజ్రాయెల్తోపాటు ఇతర దేశాల పౌరులు ఉన్నారు. హమాస్ మిలిటెంట్ల బందీల్లో 20 మందికిపైగా మైనర్లు, 10 నుంచి 20 మంది 60 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులు ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇక రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధంలో భారీగా ప్రజలు మృతి చెందారు. హమాస్ దాడిలో 1,400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్ దాడిలో సుమారు 4,137 మంది మరణించారు. యుద్ధం నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.
Also Read..
Justin Trudeau | భారత్ చర్యలతో లక్షలాది మందికి ఇబ్బందులు.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రూడో
Israel-Hamas War | గాజాపై బాంబుల వర్షం.. సేఫ్ జోన్లపైనా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడులు
Rohit Sharma: కోహ్లీ, రాహుల్తో రోహిత్ ఫోటో.. వైరల్గా మారిన ఇన్స్టా పిక్