Israel-Hamas War | ఖాన్యూనిస్(గాజాస్ట్రిప్), అక్టోబర్20: హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు శరణార్థులుగా మారారు. దక్షిణ గాజా సురక్షితమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. గాజాలో సురక్షితమైన జోన్లు ఏవీ లేవని ఇజ్రాయెల్ మిలటరీ అధికారిక ప్రతినిధి నిర్ దినార్ శుక్రవారం మీడియాతో చెప్పారు. ఇజ్రాయెల్ బాంబు దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ‘దక్షిణ గాజాలో పాలస్తీనియన్లు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. గాజా అంతటా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉత్తర గాజాకు వెళ్లినవారంతా మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నారు’ అని ఐరాస మానవ హక్కుల అధికార ప్రతినిధి రవీనా శ్యామ్దాసానీ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు సమకూర్చిన సామగ్రితో కూడిన వాహనాలు ఈజిప్టు-గాజా సరిహద్దులోని రఫా క్రాసింగ్ వద్ద బారులు తీరాయి. దాదాపు 200 ట్రక్కుల్లో 3వేల టన్నులకుపైగా సామాగ్రి అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఈ ట్రక్కులు శనివారం లేదా ఆ తర్వాత గాజాలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐరాస చీఫ్ ఆంటోనియె గుటెర్రస్ తాజాగా తెలిపారు. సహాయ సామాగ్రి వీలైనంత త్వరగా గాజాకు చేరుకునేలా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు ఐరాస మానవతా వ్యవహారాల విభాగం ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు. గాజాలోని ఖాన్యూనిస్లో పిల్లలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారు. గాజా దక్షిణ సరిహద్దు వెంబడి వందలాది మందిని అంబులెన్సుల్లో స్థానిక దవాఖానకు తరలిస్తున్నారు. గాజాలో రెండో అతిపెద్ద దవాఖాన అయిన ‘నాజర్ హాస్పిటల్’ గాయపడ్డవారితో, శరణార్థులతో నిండిపోయింది.
గాజాస్ట్రిప్లోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైనిక బలగాలు రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్స్ మనిషి రూపం లో ఉన్న మృగాలని, వీరిని పిట్టల్లా కాల్చిపారేస్తామని ఇజ్రాయెల్ మంత్రి డిచర్ ప్రకటించారు.
యెమెన్ తీరం నుంచి ఇరాన్ మద్దతున్న హుతి మిలిటెంట్లు ఇజ్రాయెల్ దిశగా ప్రయోగించిన క్షిపణులను అమెరికా యుద్ధ నౌక కూల్చేసింది. ఈ విషయాన్ని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ పాట్ రైడర్ వెల్లడించారు. యూఎస్ఎస్ కార్ని సుమారు మూడు క్షిపణులను గాల్లోనే పేల్చేసిందన్నారు. దీంతోపాటు పలు డ్రోన్లను కూడా హుతి మిలిటెంట్లు ప్రయోగించారని వివరించారు.