నిజామాబాద్, జూలై 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేశారు. నాలుగున్నరేళ్ల కాలం లో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, మంత్రి కేటీఆర్ చొరవతో నూతన జిల్లా అన్నింట్లో ముందంజలో దూసుకెళ్తున్నది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి పెరిగింది. వసతుల కల్పనలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ను కల్పించింది. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డిలను మున్సిపాలిటీలుగా మార్చా రు. వాటికి రూ.కోట్ల నిధులు వెచ్చించి పట్టణ స్థాయి మెరుగులు దిద్దారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నుంచి ప్రతినెలా విడుదలవుతున్న నిధులతో సౌకర్యాలన్నీ మెరుగవుతున్నాయి. పల్లెలన్నీ సీఎం కేసీఆర్ దార్శనీకతతో తళుక్కుమంటుండగా మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడింది. సమీకృత కలెక్టరేట్, పోలీస్ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. తద్వారా కామారెడ్డి జిల్లాకు మొత్తం రూ.152.60 కోట్లు మంజూరు కావడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం హామీ ఇలా…
జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లో జూన్ 20న జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేసిన పలు అభ్యర్థనలు, విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పురోగతికి నిధులు కేటాయించాలని, పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు వసతులు మెరుగు పర్చేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని విన్నవించారు. ఆయ న అభ్యర్థనలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకుని మొదట చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కాలేజీ మంజూరుపై స్పష్టతను ఇచ్చి అందరినీ సంతోషపెట్టారు. తదనంతరం కామారెడ్డి నియోజకవర్గంలో పలు సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్ ఉన్నతీకరణకు ఆమోదం తెలిపారు. తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించి బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు.తన పర్యటన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఒక్కో జీపీకి రూ.10లక్షలు చొప్పున నిధు లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
నెరవేరిందిలా…
ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.152.60 కోట్లు మంజూరు చేస్తూ గురువారం జీవో విడుదల చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు పేరిట విడుదలైన జీవోలో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అందించాల్సిన నిధులపై స్పష్టంగా వివరాలు పేర్కొన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీకి రూ.25కోట్లు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి రూ.25కోట్లు, కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50కోట్లు విడుదల చేశారు. అంతేగాకుండా ఒక్కో జీపీకి రూ.10లక్షలు చొప్పున రూ.52.60 కోట్లు పంచాయతీలకు మంజూరయ్యాయి. సీఎం అందించిన నిధులతో ఆయా స్థానిక సంస్థల్లో ప్రజా ఉపయోగకర పనులు నిర్వహించుకునేలా మార్గదర్శకాలు సైతం జారీ అయ్యాయి. ఇప్పటికే ఫైనాన్స్ కమిషన్ నిధులు నెలవారీగా మంజూరవుతుండడంతో జీపీలకు ఆర్థిక స్వేచ్ఛ పుష్కలంగా లభించింది. గతంలో రూపాయి ఖర్చు చేద్దామంటే పైసా లేని దుస్థితి నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రూ.లక్షలు మంజూరవుతుండడంతో జీపీలు పురోగమిస్తున్నాయి. పల్లె ప్రగతి పనులతో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నమూనాగా మారుతుండడం విశేషం.
మున్సిపాలిటీలకు మహర్దశ
కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి మున్సిపాలిటీకి సర్కారు నుంచి సహకారం లభిస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కృషితో ఇప్పటి వరకు కామారెడ్డి పట్టణంలో రూ.వంద కోట్ల మేర పనులు జరిగాయి. ఇం దులో రూ.62 కోట్ల వరకు ప్రత్యేక నిధులున్నాయి. తాజాగా రూ.50 కోట్లు సీఎం కేసీఆర్ అందించడంతో జిల్లా కేంద్రం మరింతగా అభివృద్ధి చెందనున్నది. ప్రతి వార్డులో సీసీ రో డ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాలు, ప్రధాన రహదారుల విస్తరణ, పార్కుల అభివృద్ధి, చెత్త శుద్ధీకరణ ప్లాంట్లు వంటి కార్యక్రమాలు అనేకం జరిగాయి. నూతనంగా ఏర్పడిన బాన్సువాడ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయత్నించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లు పైబడిన నిధులతో పట్టణాన్ని తీర్చిదిద్దారు. తాజాగా రూ.25కోట్లు సీఎం మంజూరు చేయడంతో బాన్సువాడలో మరిన్ని వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి గతంలో మంత్రి కేటీఆర్ కోట్ల నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ చొరవతో ఏడాదిన్నర కాలంలో ఎల్లారెడ్డి పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా తాజాగా రూ.25 కోట్లతో మరిన్ని సౌకర్యాల కల్పనకు ఊతం ఇవ్వనుంది.