ఇన్నాళ్లూ రంది లేకుండా నడిచిన ఎవుసం.. మళ్లీ భారమవుతున్నది. సాగు కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ హయాంలో సాగు మొదలు వెట్టక మునుపే రైతుబంధు పైసలు ఖాతాల పడేటివి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో పడాల్సిన పెట్టుబడి పైసలు సాగు పూర్తయినా రాలేదు. మొదటి సీజన్లోనే రైతుభరోసా వేయని వాళ్లు… ఇక వచ్చే సీజన్కు ఏం వేస్తారు. దీంతో అప్పులు చేయకతప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతుకు అండగా ఉంటామంటూనే మా నెత్తిన అప్పుల బండలు వేశారు. ఇకమీదట ఐదెకరాల వరకే పెట్టుబడి సాయం చేస్తామంటున్నారు. ఐదు ఎకరాలకు పైబడి ఉన్నవాళ్లమంతా రైతులం కాదా? మాకేం ఇబ్బందులుండవా? అంటూ అభిప్రాయపడుతున్నదీ ఉమ్మడి జిల్లా రైతాంగం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి అంతా అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇసుంటోళ్లకు మళ్లీ ఓటేస్తే ఎవుసాన్ని దండుగ అంటారని అలాంటోళ్లకు ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్తాం. రైతుకు ఎలాంటి రందీ లేకుండా చూసిన కేసీఆర్ వైపే ఉంటామని పేర్కొంటున్నారు.
డిచ్పల్లి, మే 9: కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారింది. కాలమైనంక ఆన పడ్డట్లు కోతలైనంక రైతుబంధులిస్తున్నారు. రైతులకు ఊపిరి పోసిన రైతుబంధు కేసీఆర్ పాలనలో షురు అయినప్పటి నుంచి ఇంత గడ్డుకాలం ఎన్నడూ ఎదురుగాలే. నాకు ఆరెకరాల భూమి ఉంది. ఈ యాసంగిలో వరి పంట వేసిన, పంట పెట్టుబడి ఖర్చుల కోసం అప్పు తీసుకొచ్చాను. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతుబంధు డబ్బులు సాగుకు ముందుగానే అచ్చినాయి. ఇప్పుడేమో వరి సీజన్ అయ్యాక ఇస్తున్నది. నాకున్న ఆరు ఎకరాల్లో ఒక్క ఎకరాకు రైతుబంధు రాలేదు.
-గంగారాం, రైతు, పాల్దా, నిజామాబాద్ రూరల్ మండలం
బోధన్, మే 9: కేసీఆర్ హయాంలో రైతుబంధుతో మా కష్టాల తీరినయ్. సాగునీటి ఇబ్బందులు లేకుండా పోయినయ్.. టైమ్కు రైతుబంధు మా ఖాతాల్లో పడుతుండె.. దీంతో అప్పుల కోసం తిరుగుడు బంద్ చేసినం.. రైతుబంధు పైసలతో విత్తనాలు, మందులు, ఎరువులు కొనేవాళ్లం.. నాట్లకు, పనులకు కూలీలకు కూలీలు రైతుబంధు డబ్బుల నుంచే ఇచ్చేవాళ్లం.. నాకు ఆరు ఎకరాలు ఉంది. ఈ ఆరు ఎకరాల్లో ఏడేండ్ల పాటు పంటలు వేసుకుని.. కష్టాల నుంచి గట్టెక్కిన.. ఇప్పుడు పరిస్థితి ఇలా లేదు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పైసలు ఎప్పుడిస్తదో.. అసలు ఇవ్వదో తెలియడంలేదు.. రైతుబంధు ఇవ్వకపోతే.. మాలాంటి రైతులు గోస పడకతప్పదు.
-మోరే విశ్వంబర్, రైతు, టాక్లీ, కోటగిరి మండలం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలే ఉన్నాయి. సాగు సమయంలోనే రైతుబంధు సాయం అందిస్తే మాకు ఉపయోగపడుతుంది. ఎప్పడంటే అప్పుడు, కోతలు పూర్తయ్యాక ఇస్తే ఏం లాభం. కేసీఆర్ పాలనలో రైతుబంధు కరెక్టు టైంకు పడుతుండే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు కష్టాలే ఎదురవుతున్నాయి. సమయానికి సాయం చేస్తేనే రైతులకు న్యాయం చేసిన వాళ్లవుతారు. లేకపోతు వచ్చే రోజుల్లో రైతులు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరేషాన్ల పడుడు ఖాయం.
– దుర్గారెడ్డి, రైతు, కొల్లూర్, బాన్సువాడ మండలం
ఎల్లారెడ్డి రూరల్, మే 9: రైతుల కష్టాలు తెలిసినవాడు, రైతుబాంధవుడు కేసీఆర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రైతుబంధు ఇచ్చి రైతులకు ఆదుకున్నాడు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడంలేదు. రైతుబంధు అనేది పంటవేసే మొదట్లోనే రైతుకు అందజేసే సాయం, కానీ దానిని రైతు పూర్తిగా అప్పుల పాలైన తర్వాత పంట కోతకు వచ్చిన సమయంలో ఇచ్చేది కాదని కాంగ్రేస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆ మాత్రం తెలియదా..పడి ఆకలి తీర్చుకున్న తర్వాత అన్నంపెట్టి లాభమేంటి. రైతుబంధు సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు మళ్లీ అప్పులపాలవుతున్నరు.
-పాశం రాంరెడ్డి, రైతు, అల్మాజీపూర్
బోధన్, మే 9: సీఎం, మంత్రులు ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తామని ప్రకటనలు చేస్తూ టెన్షన్ పెడుతున్నరు. ఐదెకరాలు, పదెకరాలు, ఇరవై ఎకరాలున్నా.. రైతు రైతే. నాకు పదెకరాల భూమి ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తారు.. అప్పులు ఇప్పిస్తారు. మాలాంటి రైతుల గురించి ఆలోచించరు.. రైతుల గురించి ఫస్ట్టైమ్ ఆలోచన చేసింది కేసీఆర్ సారే.. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాల వరకే రైతుబంధు ఇస్తామని చెప్పడం సరికాదు.
-బీర్కూర్ శ్యామ్కుమార్, రైతు, కోటగిరి