Iran-US, Israel : ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ సెంట్రల్ ఆపరేషనల్ కమాండ్ ఖాటమ్ అల్ అన్బియా ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు ఈ సంస్తలు, బ్యాంకులకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక కీలక బ్యాంకుపై ఇజ్రాయెల్ అర్ధరాత్రి దాడి చేసింది. ఈ ఘటనలో చాలా మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము కూడా ఇలాగే అమెరికా, ఇజ్రాయెల్లకు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడి చేస్తామని, అక్కడి ప్రజలు ఆ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ తమ బ్యాంకులపై దాడి చేయడం ద్వారా తాము కూడా అలాంటి సంస్థలపై దాడులు చేసేందుకు తగిన కారణాన్ని ఇచ్చిందని ఇరాన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ కంట్రీస్లోని అమెరికాకు చెందిన సంస్థలపై దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ దాడులకు సంబంధించి అమెరికన్ సంస్థల టార్గెట్ లిస్టును ఇరాన్ ప్రకటించింది.
ఇందులో ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీలు, ఇన్ఫ్రా కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, పాలంటిర్, నివిడియా, ఒరాకిల్ వంటి సంస్థలున్నాయి. ఈ సంస్థలు గల్ఫ్ కంట్రీస్లో, ఇజ్రాయెల్లలో పలు ఆఫీసుల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు చమురు సంస్థలు, ఆర్థిక కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ఇండియా, చైనా వంటి పలు ఆసియా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.