Ayatollah Ali Khamenei : ప్రస్తుతం ఇరాన్లో ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని, అతడి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్కు వీకాఫ్ ఇచ్చాం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మౌంట్ రష్మోర్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరాన్లో ఖమేని అంత్యక్రియలు వారం రోజులపాటు జరగనున్నాయి. ఇప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ అంశంపై ట్రంప్ తాజా సమావేశంలో మాట్లాడారు.
ఇరాన్ ప్రజలు వారం రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వీకాఫ్ ఇచ్చామన్నారు. ఎందుకంటే మనం మంచివాళ్లం అంటూ అక్కడి అమెరికన్లతో వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా విజయం సాధించిందన్నారు. ‘‘మనం ఇరాన్ను దారుణంగా ఓడించాం. యుద్ధం కారణంగా ఇరాన్ దారుణంగా నష్టపోయింది. వారు దీన్నుంచి కోలుకోవడానికి కష్టపడుతున్నారు. మనం చాలా మంచి వాళ్లం కాబట్టి ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్కు వీకాఫ్ ఇచ్చాం. అమెరికాలో ఉన్న అతివాదులు, ఉగ్రవాదుల వల్ల దేశ సమగ్రతకే ముప్పు పొంచి ఉంది. అమెరికాకు స్వతంత్రం లభించి 250 ఏళ్లవుతున్న తరుణంలో అమెరికా గుర్తింపుపై దాడి జరుగుతోంది. కమ్యూనిస్టుల నుంచి మన దేశానికి మళ్లీ ప్రమాదం పొంచి ఉంది. మనలో ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మార్చడానికి, అమెరికన్ల స్ఫూర్తిని దెబ్బతీయడానికి, చరిత్రను మన నుంచి దూరం చేయడానికి కొన్నేళ్లుగా తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్తో యుద్ధంతోపాటు ఆయన ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడిన తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై దాడులు కొనసాగించిన అమెరికా ఇప్పుడు కాస్త విరామం ఇచ్చింది. ఖమేని అంత్యక్రియల నేపథ్యంలో ఇరు దేశాలు ఎలాంటి పరస్పర దాడులకు దిగడం లేదు. గత ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా జరిపిన దాడిలో ఖమేని మరణించాడు. ఇంతకాలానికి యుద్ధం ముగింపు దశకు చేరడంతో ఆయన అంత్యక్రియల్ని ఇరాన్ నిర్వహిస్తోంది.