Roman Babushkin : మా దేశం నుంచి చమురు కొనుగోలు అంశంలో భారత్ (India) పై అమెరికా (US) వైఖరి అన్యాయంగా ఉందని రష్యా (Russia) వ్యాఖ్యానించింది. భారత్-రష్యా (India-Russia) మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోను కొనసాగుతుందని రష్యా దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ (Roman Babushkin) ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం న్యూఢిల్లీ సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందని రోమన్ బబుష్కిన్ అన్నారు. భారత్తో సంబంధాలపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతోందని విమర్శించారు. వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఆంక్షలు విధించరని వాషింగ్టన్ను ఆయన దెప్పిపొడిచారు. రష్యా భవిష్యత్తులోను భారత్పై అలాంటి చర్యలు తీసుకోదన్నారు.
భారత్కు ఎలాంటి ఇబ్బందిలేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని బబుష్కిన్ చెప్పారు. ప్రస్తుతం సగటున 5 శాతం డిస్కౌంట్తో భారత్ అవసరాల్లో 40 శాతం చమురును సరఫరా చేస్తున్నామన్నారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు భారత్ ఇబ్బంది పడాల్సివస్తే రష్యా మార్కెట్లు స్వాగతం పలుకుతాయని వ్యాఖ్యానించారు.
భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి తమ దేశం కట్టుబడి ఉందని బబుష్కిన్ అన్నారు. చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్లపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. భారత్లో ఉత్పత్తులు చేయడానికి న్యూఢిల్లీకి సరైన భాగస్వామి రష్యానే అని చెప్పారు. గతంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీని గుర్తుచేశారు. శక్తిమంతమైన జెట్ ఇంజిన్ల తయారీపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు.
భారత్ తమకు చాలా ముఖ్యమైన దేశమని, అందుకే అధ్యక్షుడు పుతిన్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ప్రధాని మోదీతో మాట్లాడారని బబుష్కిన్ అన్నారు. సమస్యల పరిష్కారంపై బీజింగ్-న్యూఢిల్లీ కలిసి పనిచేయడాన్ని స్వాగతించారు. చైనా మంత్రి వాంగ్యీ పర్యటన విజయవంతమైందని చెప్పారు.
రష్యాను శిక్షించేందుకు ఆంక్షలు విధించినవారే ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారని రోమన్ బబుష్కిన్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో కుదుపులు నెలకొన్న నేపథ్యంలో వాటిని స్థిరీకరించే శక్తిగా బ్రిక్స్ ఉంటుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలను రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చిన నేపథ్యంలో రష్యా నుంచి స్పందన వెలువడటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో ట్రంప్ సుంకాలు అమల్లోకి రానున్నాయి.