అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో ఏడు గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ఈ నెల 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయమంత పెద్దది మరోటి లేదు. అంతేకాదు మిడిల్ ఈస్ట్లోనే ఇది అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకున్నది. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
2015లో ఈ ఆలయా నిర్మాణానికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2018లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయం వెయ్యేండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని పింక్ శాండ్ స్టోన్తో సంప్రదాయ, ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించారు. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో ఏడు గోపురాలను ఏర్పాటు చేశారు. ఇవేగాకుండా ఆలయ వైభవాన్ని ఇనుమడింప చేసే మరో ఐదు గోపురాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలంతో పాటు వివిధ థీమ్ పార్క్లు, తాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయంలో నిర్మించారు.