Europe : యూరప్ ఎండలతో అట్టుడికిపోతోంది. అక్కడ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోత, వడదెబ్బలతో అల్లాడుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా యూరప్లో 1,300 మందికిపైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఎండల కారణంగా సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎండ ప్రభావానికి గురైన వారికి అత్యవసర సేవలు అందించేందుకు అక్కడి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
డిమాండ్కు తగ్గట్లుగా సేవలు అందించలేకపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు అధికంగా ఇబ్బందులు పడుతున్నారు. యూరప్లోని అనేక దేశాలు ఎండ, వడగాల్పుల ప్రభావానికి గురవుతున్నాయి. జర్మనీలో అత్యధికంగా గత ఆదివారం 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఫ్రాన్స్లో 43.3 డిగ్రీలు, బ్రిటన్లో 38.8 డిగ్రీల ఎండ నమోదైంది. 1950 తర్వాత ఈ రేంజ్లో ఎండలు పెరగడం ఇదే మొదటిసారి. సగటున యూరప్లో వేసవిలో 20-27డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి. అలాంటిది 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ పెరగడంతో స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. దీంతో పగలూ, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే యూరప్ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. గత పది రోజుల్లోనే యూరప్ వ్యాప్తంగా 1300 మందికిపైగా ఎండల కారణంగా మరణించారు.
వీరిలో పిల్లలు, యువత, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బెర్లిన్ వంటి దేశాలు అధికంగా ఎండ ప్రభావానికి గురవుతున్నాయి. వడదెబ్బ బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల వారికి తగిన వైద్యం అందించలేనంతగా ఆస్పత్రుల్లో డిమాండ్ పెరిగిపోయింది. 2022 నుంచి అక్కడ ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఐదేళ్లో ఎండల కారణంగా అక్కడ 60,000 మంది మరణించారు. యూరప్ శీతల ఖండం. అందువల్ల అక్కడి ఇండ్లు, ఇతర నిర్మాణాలు వెచ్చగా ఉండేందుకు డిజైన్ చేశారు. దీంతో ఇంట్లోని వారు కూడా త్వరగా ఎండ ప్రభావానికి గురవుతున్నారు.