Elon Musk | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో శాశ్వత సభ్యత్వం (Permanent Seat) కోసం భారత్ ( India) దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్ ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఐరాస విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ.. భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడట్లేద. ఇదే సమస్యకు కారణమవుతోంది. ఆఫ్రికా యూనియన్కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అంటూ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో భారత్కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఐదు దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ ఐదు దేశాలలో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఐదింటిలో నాలుగు మద్దతు ఇస్తున్నా.. చైనా మాత్రం భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతోంది.
Also Read..
Ram Temple | రామమందిరం వద్ద గందరగోళ పరిస్థితి.. సెక్యూరిటీని తోసుకుంటూ వెళ్లిన భక్తులు
Zomato | ప్రాణ ప్రతిష్ట వేళ.. నాన్వెజ్ను నిషేధించిన జొమాటో
PM Modi | ఈ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి.. ప్రాణప్రతిష్ట వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ